విశాఖకు గూగుల్ రావడానికి లోకేశ్‌ది ప్రధాన పాత్ర: చంద్రబాబు

విశాఖపట్నంకు గూగుల్ రావడానికి ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రధాన పాత్ర పోషించారు..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

By -  Knakam Karthik
Published on : 15 Oct 2025 12:19 PM IST

Andrapradesh, Cm Chandrababu, Pm Modi, Kurnool District,

విశాఖకు గూగుల్ రావడానికి లోకేశ్‌ది ప్రధాన పాత్ర: చంద్రబాబు

అమరావతి: విశాఖపట్నంకు గూగుల్ రావడానికి ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రధాన పాత్ర పోషించారు..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రేపు (గురువారం) ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో మాట్లాడారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ...రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేద్దాం. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్దఎత్తున లాభం చేకూరుతోంది. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో నిన్న గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం. 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రాకతో ఐటీ ఎకో సిస్టం ఏర్పడి.. నాలెడ్జి ఎకనామీకి పునాది పడింది. ఏపీకి గూగుల్ డేటా హబ్ రావటంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉంది. గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి వచ్చేలా చేశారు. అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకు వచ్చింది. దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టుబడి. విభజనతో ఎదుర్కోన్న ఇబ్బందుల కంటే గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. పాలనా పరంగా అనేక తప్పులు చేశారు...వాటిని సరి చేయడానికే చాలా సమయం పట్టింది. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేశాం..అని సీఎం అన్నారు.

ఇప్పుడు ప్రధాని మోదీ పాల్గోనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దాం అని పిలుపునిస్తున్నాను, జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతుంది. నెక్స్ జెన్ సంస్కరణలపై నెల్లాళ్లుగా విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం. సీమ జిల్లాలు ఉద్యావన పంటలకు కేంద్రంగా మారాయి. రాష్ట్రంలో పోర్టులు, రైల్వేల కనెక్టివిటీ ద్వారా సంపద సృష్టి జరుగుతుంది. గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు కనీసం 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు, రాయలసీమ టూరిజం డెస్టినేషన్‌గా మారుస్తాం. తిరుపతి, శ్రీశైలం, గండికోట లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా మనం అంతా పనిచేయాలి. రేపు కూడా ప్రధాని రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కర్నూలులో జీఎస్టీపై ప్రధాని సభకు సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. గ్రామ స్థాయి నుంచి మూడు పార్టీల నేతలు సమన్వయంతో ఈ సభను విజయవంతం చేయాలి. కూటమి నేతలంతా కలిసి ఓ మోడల్ స్టేట్‌గా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి. ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్ధశ రాబోతోంది. తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న క్షేత్రంగా శ్రీశైలం అభివృద్ది చేస్తాం..అని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story