ఆయుర్వేదమా..? నాటు మందా..?.. ఆనంద‌య్య మందుపై నేడు క్లారిటీ..!

Clarity today on Anandayya Mandu.ఆనందయ్య కరోనా మందు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2021 1:31 AM GMT
ఆయుర్వేదమా..? నాటు మందా..?.. ఆనంద‌య్య మందుపై నేడు క్లారిటీ..!

ఆనందయ్య కరోనా మందు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్‌. ప్ర‌జ‌లు దీనిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కాగా.. ఈ మందుపై పూర్తి స్థాయి ప‌రిశోధ‌న‌లు చేసే వ‌ర‌కు పంపిణీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిలిపివేసింది. ఆయ‌న మందుకు అన్ని అనుమ‌తులు వ‌స్తాయ‌ని.. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ఎంతో న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా.. ఆనంద‌య్య మందు ఆయుర్వేద‌మా..? లేక నాటు మందా..? అనే ప్ర‌శ్న‌కు నేడు స‌మాధానం దొర‌క‌నుంద‌ని ఆయూష్ అధికారులు అంటున్నారు.

ఆయూష్ అధికారులు, టీటీడీ ఆయుర్వేద వైద్యులు ఆనంద‌య్య మందు త‌యారీ, ఆ మందు తీసుకున్న వారి నుంచి వివ‌రాలు సేక‌రించారు. ఆనంద‌య్య మందులో ఎలాంటి హానికర ప‌దార్థాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే.. ప్ర‌స్తుతం సీసీఆర్ఏఎస్ అధ్య‌య‌నం కోసం అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక వారం రోజుల అనంత‌రం శుక్ర‌వారం త‌న స్వ‌గ్రామానికి ఆనంద‌య్య చేరుకున్నారు. ఈ నెల 21న చివ‌రిగా ఆయ‌న మందు పంపిణీ చేశారు. అప్ప‌టి నుంచి ఆనంద‌య్య‌ను పోలీసు ర‌క్ష‌ణ‌లో ఉన్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం ఆయ‌న త‌న స్వ‌గృహానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాను ఎక్క‌డికి వెళ్ల‌న‌ని.. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రాగానే మందు త‌యారు చేస్తాన‌న్నారు. ముందుగా గ్రామంలోని వారంద‌రికి ఇస్తాన‌ని చెప్పారు. ఎలాంటి వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. అలాగే తన దగ్గర మూలికలు కూడా స్టాక్ లేవని చెప్పారు. ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత.. మూలికలు అందుబాటులోకి వస్తే పంపిణీని ప్రారంభిస్తానని.. అప్పటివరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేశారు.




Next Story