నోట్ల మార్పిడీ కేసులో మహిళా ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత అరెస్ట్

నోట్ల మార్పిడి కేసులో విశాఖపట్నం పోలీసులు మహిళా ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతను అరెస్ట్ చేశారు.

By Srikanth Gundamalla
Published on : 8 July 2023 7:15 AM IST

CI Swarnalatha, Arrest, currency Notes Exchange Case,

నోట్ల మార్పిడీ కేసులో మహిళా ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత అరెస్ట్

ఏపీ వ్యాప్తంగా గాజువాక రూ.2వేల నోట్ల మార్పిడి కేసు సంచలనం సృష్టించింది. ఈకేసులో విశాఖపట్నం పోలీసులు మహిళా ఇన్‌స్పెక్టర్‌, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత సహా నలుగురిని అరెస్ట్ చేశారు. గాజువాకకు చెందిన ఇద్దరు రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులను రూ.2వేల నోట్ల మార్పిడి పేరుతో బురిడీ కొట్టించి రూ.12 లక్షలు కాజేశారు. ఈ కేసులో స్వర్ణలతను అరెస్ట్ చేసినట్లు పోలీస్‌ కమిషనర్ త్రివిక్రవర్మ తెలిపారు.

'గాజువాకకు చెందిన కొల్లి శ్రీను, శ్రీధర్‌ ఇద్దరూ విశ్రాంత నేవీ ఉద్యోగులు. వీరికి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ సూరిబాబు నోట్ల మార్పిడి చేస్తే డబ్బు బాగా మిగులుతుందని ఆశచూపించాడు. రూ.90లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2వేల నోట్లు వస్తాయని.. ఒకే డీల్‌లో రూ.10లక్షలు మిగులుతాయని ఆశ చూపించాడు. దీంతో.. రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులు డబ్బుతో సీతమ్మధారలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత సూరిబాబు కూడా అక్కడికి చేరుకున్నాడు. నగదు ఉన్నట్లు కన్ఫామ్ చేసుకుని సూరిబాబు ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీస్‌ వాహనంలో ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, డ్రైవర్ కానిస్టేబుల్‌ హేమసుందర్, హోంగార్డు శ్రీను ఉన్నారు. హోంగార్డు, కానిస్టేబుల్‌ సూరిబాబు బృందం వద్దకు వెళ్లి ఏం చేస్తున్నారని భయపెట్టారు. బ్యాగులో ఏముందని లాక్కుని చూశారు. డబ్బులను చూసి ఎక్కడివి? ఎందుకు తెచ్చారంటూ ప్రశ్నించారు. అడుగుతూనే సూరిబాబుని కొట్టారు. దాంతో.. రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులు భయపడిపోయారు. వారిని ఇన్‌స్పెక్టర్‌ దగ్గరకి తీసుకెళ్లగా.. డబ్బు ఎక్కడిదని ప్రశ్నిస్తే ఉన్న విషయం చెప్పారు.

డబ్బు గురించి ఐటీ వాళ్లకు తెలిస్తే పెద్ద కేసు అవుతుందనీ, కేసు లేకుండా ఉండాలంటే రూ.12లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత. దాంతో వారూ చేసి ఏంలేక అడిగినంత ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్నాక ఆలోచించి చూశారు. ఇదంతా నాటకమని అనుమానించి డీసీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులు చెప్పిందంతా నిజమే అని నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏ-1గా మధ్యవర్తి సూరి, ఏ-4గా ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత, హోంగార్డు శ్రీను, డ్రవర్ హేమసుందర్‌ను ఏ-2, ఏ-3గా పేర్కొన్నారు పోలీసులు. ఇక నిందితుల నుంచి రూ.12 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు.

ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత సినిమాలు, యాక్టింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌ చూపించింది. అధికార పార్టీ నాయకులతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు సమాచారం. వారి అండతోనే ఇలా నోట్ల మార్పిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక స్వర్ణలత హీరోయిన్‌గా 'ఏపీ 31 నంబర్ మిస్సింగ్' టైటిల్‌తో సినిమా నిర్మాణానికి సిద్ధమైంది. అందులో కూడా స్వర్ణలత పోలీస్‌ పాత్రలోనే నటిస్తోంది. సినిమాను స్వర్ణలతే నిర్మిస్తోన్నట్లు సమాచారం. దాని కోసమే నోట్ల మార్పిడికి పాల్పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అంతకు ముందు సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు పోస్టు చేసింది అవి వైరల్ అయ్యాయి. చిరంజీవి అంటే ఇష్టమంటూ.. ఆయన పాటను రీమేక్‌ చేసింది. అంతేకాదు.. స్వర్ణలత డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ వీడియోలు కూడా కొన్ని వైరల్‌ అయ్యాయి.

Next Story