పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసు.. మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌

Chittoor court grants bail to former Minister Narayana in SSC exams malpractice case.ఏపీ మాజీ మంత్రి, నారాయ‌ణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2022 3:46 AM GMT
పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసు.. మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌

ఏపీ మాజీ మంత్రి, నారాయ‌ణ విద్యాసంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ‌కు ఊర‌ట ల‌భించింది. ప‌దో త‌ర‌గ‌తి ప‌శ్న‌ప‌త్రాల లీక్ కేసులో అరెస్టైన ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది. ఈ కేసులో నిన్న(మంగ‌ళ‌వారం) ఆయ‌న్ను హైద‌రాబాద్‌లో చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి అనంత‌రం చిత్తూరు కు త‌ర‌లించారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు.. న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని ఆదేశించారు.

బెయిల్ లభించిన అనంతరం నారాయ‌ణ త‌రుపు న్యాయ‌వాది మాట్లాడుతూ.. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత‌గా ఉన్నార‌ని నారాయ‌ణ‌పై పోలీసులు అభియోగం మోపార‌న్నారు. అయితే.. 2014లోనే ఆ విద్యాసంస్థ‌ల అధినేత‌గా ఆయ‌న వైదొలిగిన‌ట్లు తెలిపారు. నారాయ‌ణ విద్యాసంస్థ‌లతో త‌న‌కు సంబంధం లేద‌ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్ల‌ను న్యాయ‌మూర్తికి స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు. నేరారోప‌ణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ నెల 18లోగా రూ.ల‌క్ష చొప్పున ఇద్ద‌రి పూచీక‌త్తు ఇవ్వాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించార‌ని తెలిపారు.

Next Story