రాయలసీమలో ఆగస్టు 1 నుంచి చంద్రబాబు పర్యటన
రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారు అయ్యింది.
By Srikanth Gundamalla
రాయలసీమలో ఆగస్టు 1 నుంచి చంద్రబాబు పర్యటన
రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారు అయ్యింది. ఈ మేరకు అధికారికంగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తారని చెప్పారు. టూర్లో భాగంగా పలు సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తారని కాలవ శ్రీనివాసులు వివరించారు.
ఆగస్టు ఒకటవ తేదీ నుంచి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శిస్తారని కాలవ శ్రీనివాసులు చెప్పారు. ఇక ఆగస్టు 3న గండికోట రిజర్వాయర్ పరిశీలన ఉంటుందని చెప్పారు. తర్వాత అనంతపురం జిల్లాకు వస్తారని కాలవ శ్రీనివాసులు తెలిపారు. 4వ తేదీన కల్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్లోని ఇతర ప్రాజెక్టులను పరిశీలిస్తారని చెప్పారు. రాయలసీమ భవిష్య్తో సీఎం జగన్ ఆడుకుంటున్నారని ఆరోపించారు కాలవ శ్రీనివాసులు. కరవు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్టును జగన్ ఆపేశారని ఆరోపించారు.
సీఎం జగన్ అసమర్ధత వల్లే రాయలసీమలో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందన్నారు. రైతులకు సాగునీరు అందించకపోవడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని కాలవ శ్రీనివాసులు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. రాయలసీమ జీవనాడి లాంటి హంద్రీనీవా వెడెల్పును వైసీపీ సర్కార్ ఆపేసిందని ఆరోపించారు. 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తామని చెప్పి టెండర్లు కూడా పిలవలేదని కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగే పనులు ఆపివేసి అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. జగన్ వైఫల్యాలను ఎండగట్టేందుకు చంద్రబాబు పర్యటన చేస్తున్నారని చెప్పారు. రైతులు చంద్రబాబుకు మద్దతుగా పర్యటనలో పాల్గొనాలని.. విజయవంతం చేయాలని కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.