Viveka Murder case: ఎంపీ అవినాష్రెడ్డి మరోసారి సీబీఐ నోటీసులు
మార్చి 6న హాజరుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By అంజి Published on 6 March 2023 11:03 AM IST
కడప ఎంపీ అవినాష్ రెడ్డి (ఫైల్ ఫొటో)
వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. మార్చి 6న హాజరుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాయడంతో.. ఈ నెల 10న మరోసారి హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పులివెందులలోని ఆయన నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు అందించారు. ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారు.
హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అధికారులు వచ్చే సమయానికి ఎంపీ అవినాష్ ఇంట్లో లేకపోవడంతో అధికారులు అతని తండ్రి భాస్కర్ రెడ్డికి తెలిపారు. నియోజకవర్గంలో కార్యక్రమాలు ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేమని అవినాష్ సీబీఐకి లేఖ ద్వారా తెలియజేశారు. కాగా, అవినాష్ లేఖపై సీబీఐ స్పందిస్తూ.. 10న హైదరాబాద్ కార్యాలయంలో హాజరుకావాలని స్పష్టం చేసింది. మామ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బంధువు వైఎస్ అవినాష్రెడ్డిని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది.
ఫిబ్రవరి 24, 2023న, హైదరాబాద్లోని తన కార్యాలయంలో సిబిఐ బృందం దాదాపు నాలుగున్నర గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారణ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ముందుగా జనవరి 28న విచారించారు. ఆసక్తికరంగా.. ఈసారి, కేసులో ఇతర కీలక నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సీబీఐ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను విచారణకు పిలిచింది. ఫిబ్రవరి 24న తన ప్రశ్నోత్తరాల అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని, కేసుకు సంబంధించి తనకు తెలిసిన అన్ని వాస్తవాలతో కూడిన మెమోరాండం సమర్పించానని చెప్పారు.