కంచే చేలు మేసినట్టు.. పోలీస్ స్టేషన్‌లో డబ్బు మాయం.. కొట్టేసింది పోలీసులే..!

Cash robbery case in West godavari.కంచే చేలు మేస్తే అనే సామెత వినే ఉంటారు. పశ్చిమగోదావరి జిల్లా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 1:02 PM GMT
కంచే చేలు మేసినట్టు.. పోలీస్ స్టేషన్‌లో డబ్బు మాయం.. కొట్టేసింది పోలీసులే..!

కంచే చేలు మేస్తే అనే సామెత వినే ఉంటారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్లో నగదు మాయం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు గంగాజలం, గణేశ్వర్‌రావును అరెస్టు చేసినట్లు ఎస్పీ నారాయణ నాయక్‌ తెలిపారు. నిందితుల నుంచి రూ.8.04 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, రాయకుదురు మద్యం దుకాణాలకు సంబంధించిన డబ్బును సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచారు. ఈ నెల 15వ నుంచి బ్యాంకులకు సెలవు కావడంతో ఆ నగదును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోని ఓ లాకర్‌లో డబ్బును భద్రపరిచారు.

డబ్బును జమ చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన దుకాణ సిబ్బంది లాక్ ఓపెన్ చేసి షాక్ తిన్నారు. అందులో డబ్బు కనిపించలేదు. లాకప్‌లో ఉంచిన ట్రంకు పెట్టి సీల్ తొలగించి తాళం పగులకొట్టి నగదు దొంగిలించినట్లు గుర్తించారు. స్టేషన్‌లో డబ్బు చోరీ కావడంతో పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు అధికారులు. అపహరణ విషయమై పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది విచారణ చేపట్టారు. పీఎస్‌లో డబ్బు మాయం కావడంతో అనుమానంతో సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఈ కేసులో పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లు డబ్బును చోరీ చేసినట్లు తేల్చారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ ద్వారా వీరిద్దరి గుట్టు బయటపడింది. వారిద్దరు పరారీలో ఉండగా పాలకొల్లు రూరల్ సీఐ శుక్రవారం ఉదయం వీరవాసరం మడుగు వంతెన దగ్గర ఇద్దర్ని అరెస్టు చేసి వారి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం దొంగలించిన డబ్బును, పగలగొట్టిన తాళం, చింపేసిన సీలు కాగితాలన్నీ విరగొట్టిన ట్రంక్ బాక్స్ తాళం, గొళ్ళంని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత చోరీకి పాల్పపడిన ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.8,04,330 స్వాధీనం చేసుకున్నారు.


Next Story