16,347 పోస్టులు.. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు
డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఇవాళ కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్సైట్లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది.
By అంజి
16,347 పోస్టులు.. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు
అమరావతి: డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఇవాళ కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్సైట్లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. పోస్టుకు ఒకరు చొప్పున వెరిఫికేషన్కు పిలవనుంది. రేపటి నుంచి జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రారంభం అవుతుంది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ చూస్తోంది. వెరిఫికేషన్కు హాజరు కాని, సర్టిఫికెట్లు సమర్పించని వారి స్థానంలో మెరిట్ జాబితాలోని మిగతా వారికి అవకాశం కల్పిస్తారు.
మొన్న రాత్రి డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. APDSC.in లేదా APCFSS.in అధికారిక వెబ్ సైట్ లో జాబితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్ ఐడీలు ద్వారా కాల్ లెటర్లు అందిస్తామని.. వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఏపీడీఎస్సీ వెబ్సైట్ అభ్యర్థుల లాగిన్లలో పాఠశాల విద్యాశాఖ కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనుంది. ఒక పోస్టుకు ఒకరు చొప్పున మొత్తం 16,347పోస్టులకు గాను అంతమందినే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాల్లో ప్రారంభమవుతుంది. ప్రతి 50మంది అభ్యర్థులకు ఒక బృందాన్ని కేటాయించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 20న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 6 నుంచి జూలై 2 వరకు మొత్తం 67 విభాగాల్లో పరీక్షలు జరిగాయి. 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.12 లక్షల మంది పరీక్షలు రాశారు. మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో నిర్వహించింది. టెట్ మార్కుల్లోనూ వివాదాలకు ఛాన్స్ లేకుండా అనేకసార్లు అప్డేషన్కు అవకాశం కల్పించింది. ఎంపికైనవారి జాబితాలు నేరుగా ప్రకటించాలని భావించినా, అభ్యర్థుల్లో అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో శుక్రవారం రాత్రి మెరిట్ జాబితాలు ప్రకటించింది. ఈ మొత్తం ప్రక్రియకు 125 రోజులు మాత్రమే పట్టింది. మరో వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ కూడా పూర్తికానుంది.