అమరావతి: 10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్ వేశారు. వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో.. 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు.
''ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోంది. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయ్యింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు. పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలే రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఫెయిల్. పిల్లల భవిష్యత్ ను నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వీళ్ళు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు? చదువులతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారు'' అని ప్రస్తుత, గత ప్రభుత్వాలపై షర్మిల్ ఫైర్ అయ్యారు.
''ధనదాహం మీద ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థను ఉద్ధరించడం మీద లేదు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 30 వేల మంది విద్యార్థులకు సంబంధించి 60 వేల పేపర్ల రీ కౌంటింగ్ కు వస్తే అందులో 11 వేల మందికి అత్యున్నత మార్కులు వచ్చాయంటే పూర్తిగా మీ ప్రభుత్వ వైఫల్యమే. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అయినట్లే. వెంటనే విచారణ చేయండి. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్ మళ్ళీ రీ వెరిఫికేషన్ ఉచితంగా చేయండి'' అని షర్మిల డిమాండ్ చేశారు.