నేటి నుంచే ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి.

By -  అంజి
Published on : 16 March 2026 6:39 AM IST

AP SSC Exams 2026, Andhra Pradesh 10th Class Exams, Hall Ticket Free RTC Travel, Exam Timings and Guidelines, Invigilation and Flying Squads

నేటి నుంచే ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు (మొత్తం 3 గంటల 15 నిమిషాలు) పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు సమయపాలన పాటించడం ముఖ్యం, అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఉదయం 10 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది; హాల్‌టికెట్ చూపించి విద్యార్థులు తమ కేంద్రాలకు చేరుకోవచ్చు.

ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,22,074 మంది కాగా, ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది ఉన్నారు. లింగం వారీగా చూస్తే, బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది పరీక్ష రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 210 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ గట్టి నిఘా ఉంచారు.

పరీక్షల నిర్వహణ కోసం భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. మాల్‌ ప్రాక్టీస్‌ను అరికట్టడానికి 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 33,882 మంది టీచర్లు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించనున్నారు. విశేషమేమిటంటే, ఈ ఏడాది తొలిసారిగా 7,429 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేషన్ విధులకు కేటాయించారు.

పరీక్షా హాలులో విద్యార్థులు పాటించాల్సిన నిబంధనల విషయంలో అధికారులు స్పష్టత ఇచ్చారు. విద్యార్థులు తమకు ఇచ్చే ఓఎమ్మార్‌ (OMR) షీట్‌పై ఫొటో, పేరు, రోల్ నంబరు సరిగ్గా ఉన్నాయో లేదో ముందుగా తనిఖీ చేసుకోవాలి. జవాబులు రాయడానికి మొదట 24 పేజీల బుక్‌లెట్‌ను అందజేస్తారు. ఒకవేళ అది పూర్తయితే, అదనంగా 12 పేజీల బుక్‌లెట్‌ను కూడా పొందే అవకాశం ఉంది.

Next Story