ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
By - అంజి |
ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
అమరావతి: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సేవలందించేందుకు భారీ స్థాయిలో సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో 1,433 ఖాళీలను గుర్తించారు. ఇందులో ప్రధానంగా మూడు విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు వంట మనుషులు, హాస్టల్ పనుల్లో సహాయకులుగా హెల్పర్స్, హాస్టల్ ఆవరణలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది. 142 మంది కుక్, లేబర్, 1291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సవిత తెలిపారు.
ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కేవలం సిబ్బంది భర్తీ మాత్రమే కాకుండా, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. గత కొంతకాలంగా హాస్టళ్లలో సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యార్థులకు పోషకాహారం అందించడంలో కుక్ మరియు హెల్పర్ల పాత్ర కీలకం కాబట్టి, ఈ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. 10 ఎంజేపీ బీసీ గురుకులాలలను నెలకొల్పుతామని, 6 గురుకుల స్కూళ్లను కాలేజీగా అప్గ్రేడ్ చేయబోతున్నామని తెలిపారు. పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ కోసం రూ.420 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.933 కోట్లు కేటాయించామని వివరించారు.