కరువు మండలాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం భరోసా.. హాలిడేస్లో డ్రై రేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
కరువు మండలాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం భరోసా.. హాలిడేస్లో డ్రై రేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు 'డ్రై రేషన్' (Dry Ration) పంపిణీ చేయాలని మధ్యాహ్న భోజన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. గత రబీ సీజన్ (2024-25)లో కరువు మండలాలగా ప్రకటించిన ప్రాంతాల్లో ఈ పథకం అమలు కానుంది. 51 కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 9 తరగతులు పూర్తి చేసి, ప్రస్తుతం 2 నుండి 10 తరగతులకు చేరుకున్న విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 4 కిలోలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 6 కిలోలు బియ్యం పంపిణీ చేయనున్నారు. అలాగే ప్రతి విద్యార్థికి 35 కోడిగుడ్లు, 21 చిక్కీలు అందజేస్తారు.
అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో ఈ పంపిణీ జరుగుతుంది. ఈ పంపిణీ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. రేషన్ తీసుకునే సమయంలో విద్యార్థి లేదా తల్లిదండ్రుల ఆధార్ లేదా OTP ఆధారిత ప్రమాణీకరణ (Authentication) తప్పనిసరి. అలాగే, పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు IMMS యాప్లో అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 2026 మొదటి వారం నాటికి ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు.