ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసి, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు అవసరమైన ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని శాఖల్లోని ఉద్యోగాల ఖాళీల వివరాలను తేల్చాలని సీఎస్ అదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారు.
ఖాళీల వివరాలకు సంబంధించి క్యాలెండర్ ను మే 31న విడుదల చేస్తారని చెప్పారు. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చెయ్యాలని సీఎస్ ఇటీవల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. మరోవైపు భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో డైరెక్టర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ పర్సనల్ వెబ్సైట్లో లభ్యమయ్యేలా చూడాలని సీఎస్ పేర్కొన్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులలో ప్రాధ్యానత ప్రకారం దశల వారీగా వాటిని భర్తీ చేయాలని.. ఏయే ఖాళీలను ముందుగా భర్తీ చేయాలో సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించాలన్నారు.