ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపడంతో, ఆర్థిక శాఖ నిధుల జమ ప్రక్రియను వేగవంతం చేసింది.
గురువారం ఒక్కరోజే ప్రభుత్వం ఏకంగా రూ.2,950 కోట్లను విడుదల చేయడం విశేషం. ఈ భారీ మొత్తాన్ని నేరుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే కాకుండా, ప్రస్తుతం సర్వీసులో ఉన్న పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్ బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది.
ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిల విడుదలకు కృతజ్ఞతగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా, టీఎన్ఎస్యూ (TNSU) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా "థ్యాంక్యూ సీఎం సర్" కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉద్యోగులు తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు.