ఏపీ రాష్ట్ర పండుగగా రాజం 'పైడితల్లి అమ్మవారి జాతర'
విజయనగరం జిల్లా రాజాం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
ఏపీ రాష్ట్ర పండుగగా రాజం 'పైడితల్లి అమ్మవారి జాతర'
విజయనగరం జిల్లా రాజాం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మవారి ఉత్సవాలకు ప్రభుత్వ గుర్తింపు లభించడమే కాకుండా, నిధుల మంజూరు కూడా జరగడం పట్ల భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజాం నియోజకవర్గంలోని పోలిపల్లిలో కొలువై ఉన్న పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గాను రూ. 50 లక్షల నిధులను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి తదుపరి ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా దేవదాయ శాఖ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ అమ్మవారి ఉత్సవాలు 1758వ సంవత్సరం నుంచి నేటి వరకు ఎక్కడా అంతరాయం కలగకుండా నిరాటకంగా కొనసాగుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ జాతరకు తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతగా భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
పైడితల్లి అమ్మవారి జాతర విశేషాలు
పైడితల్లి అమ్మవారి జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి. జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సిరిమానోత్సవం. ఒక పొడవైన కర్ర (సిరిమాను) చివరి భాగంలో పూజారి కూర్చుని భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తారు. అమ్మవారు ఆ పూజారి రూపంలో సిరిమానుపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. అమ్మవారి ప్రతిరూపాలుగా భావించే ఘటాలను మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఊరేగిస్తారు. సాధారణంగా జాతరకు ముందు రోజు రాత్రి 'తోలేళ్లు' ఉత్సవం నిర్వహిస్తారు. మరుసటి రోజు ప్రధాన జాతర జరుగుతుంది. భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సారెలను సమర్పిస్తారు. చాలా మంది తమ పంటలు బాగా పండాలని, పశుసంపద బాగుండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనాలు
మౌలిక సదుపాయాలు: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందడం వల్ల భక్తులకు తాగునీరు, రవాణా, క్యూలైన్లు మరియు వైద్య సదుపాయాలు మరింత మెరుగ్గా అందుతాయి. ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో రాజాం ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ నిధులతో ఉత్సవాలను గతంలో కంటే మిన్నగా నిర్వహించే అవకాశం కలుగుతుంది.