ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త.. ఉచితంగా ల్యాప్టాప్లు
AP GOVT give laptops for students under Amma Vodi Scheme.విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు
By తోట వంశీ కుమార్
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9,10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద ల్యాప్టాప్లు ఇవ్వాలని నిర్ణయించింది. అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నగదును వద్దనుకున్న వారికే ల్యాప్ టాప్ లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల(ఇంచ్) స్క్రీన్, విండోస్ 10 (ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్)ల కాన్ఫిగరేషన్తో ల్యాప్టాప్లు అందించనుంది. వీటికి మూడేళ్ల వారంటీ ఉంటుంది. ల్యాప్టాప్లకు మెయిన్టెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఏమైన సమస్యలు ఉంటే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది.
సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకానికి అర్హులు ఎవరంటే.. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరి. స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి ఉంటుంది.