'ఆ భూములను అమ్ముకోవచ్చు'.. పేదలకు ఏపీ సర్కార్ శుభవార్త
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, నిరుద్యోగులకు మేలు చేకూర్చే పలు చారిత్రాత్మక నిర్ణయాలు...
By - అంజి |
'ఆ భూములను అమ్ముకోవచ్చు'.. పేదలకు ఏపీ సర్కార్ శుభవార్త
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, నిరుద్యోగులకు మేలు చేకూర్చే పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించి విక్రయ నిబంధనలను భారీగా సరళీకరించింది. ఇప్పటివరకు పట్టా మంజూరైన పదేళ్ల తర్వాతే అమ్ముకునే హక్కు ఉండగా, ఆ గడువును కేవలం రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 2024లో స్థలం పొందిన వారు కూడా రెండేళ్ల తర్వాత దానిని విక్రయించుకునే లేదా బదిలీ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో లక్షల మంది పేదలకు ప్రయోజనం చేకూరనుంది.
ఉద్యోగ నియామకాలు మరియు బదిలీల ప్రక్రియలో పారదర్శకత కోసం జోన్ల వ్యవస్థలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రస్తుతం ఉన్న 4 జోన్ల స్థానంలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లను ఏర్పాటుకు ఒకే చెప్పింది. అలాగే, రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రైవేటు వర్సిటీలు తక్కువగా ఉన్నాయని భావించిన ప్రభుత్వం, భూమి, పెట్టుబడి నిబంధనలను సడలించి మరిన్ని యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పెట్టుబడుల విషయంలోనూ కేబినెట్ కీలక పురోగతి సాధించింది. ఎస్ఐపీబీ (SIPB) సిఫార్సుల మేరకు రూ. 9.36 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా సుమారు 9.62 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల క్రమబద్ధీకరణ గడువును 2026 డిసెంబరు 31 వరకు పొడిగించారు. ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ పేరును 'ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ'గా మారుస్తూ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.