ఏపీ బడ్జెట్ 2026-27: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా భారీ పద్దు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు (ఫిబ్రవరి 14, 2026) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు.
By - అంజి |
ఏపీ బడ్జెట్ 2026-27: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా భారీ పద్దు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు (ఫిబ్రవరి 14, 2026) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న మూడవ బడ్జెట్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే 2026-27 వార్షిక బడ్జెట్ నేడు అసెంబ్లీ వేదికగా ఆవిష్కృతం కానుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే, ఎన్నికల హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించారు. ఈ ఏడాది బడ్జెట్ సుమారు రూ. 3.45 లక్షల కోట్ల నుండి రూ. 3.50 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇది గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. సూపర్ సిక్స్ హామీలు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీల అమలు కోసం ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
తల్లికి వందనం: పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం.
అన్నదాత సుఖీభవ: రైతులకు పెట్టుబడి సాయం.
దీపం 2.0: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ.
స్త్రీ శక్తి: మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సాయం (ఈ బడ్జెట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది).
ఉచిత బస్సు ప్రయాణం: మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది.
రాజధాని అమరావతి పనులను వేగవంతం చేసేందుకు, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్ నుండి కూడా గణనీయమైన కేటాయింపులు ఉండనున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి, భూసేకరణకు నిధులు కేటాయించనున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రవ్యాప్తంగా గుంతలమయమైన రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఉండనుంది. ప్రధాన బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. సాగునీటి ప్రాజెక్టులు, రాయితీపై విత్తనాలు, ఎరువులు మరియు ఉద్యానవన రంగానికి ఇందులో ప్రాధాన్యత ఉండనుంది.
షెడ్యూల్ ఇలా
- ఉదయం 10:30: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ (బడ్జెట్కు అధికారిక ఆమోదం).
- ఉదయం 11:15: అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం.
- మధ్యాహ్నం: శాసనమండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ను ప్రవేశపెడతారు.