Andhra Pradesh: అసైన్డ్ భూముల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం 'ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధం) (సవరణ) బిల్లు-2026' ను ఆమోదించింది.

By -  అంజి
Published on : 27 Feb 2026 8:08 AM IST

AP Assigned Lands Bill 2026, AP Assembly Sessions, Anagani Satya Prasad, Renewable Energy AP, Solar Power Projects, AP Clean Energy Policy 2024, GSWS Amendment Bill, AP Green Energy

Andhra Pradesh: అసైన్డ్ భూముల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం 'ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధం) (సవరణ) బిల్లు-2026' ను ఆమోదించింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను సులభతరం చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.

గతంలో 1977 నాటి చట్టం ప్రకారం.. భూమి లేని పేదలకు సాగు కోసం కేటాయించిన అసైన్డ్ భూములను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం నిషిద్ధం. అయితే, తాజా సవరణ ద్వారా ప్రభుత్వం ఈ భూములను దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన సేకరించి, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోనుంది.

10,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు: రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఈ భూములను 'ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్' (గతంలో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్)కు లీజుకు ఇచ్చేందుకు వీలు కల్పించింది. ఈ భూములను వ్యవసాయేతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.

ఏపీ సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ద్వారా 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని, తద్వారా ₹10,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో జారీ చేసిన 2025 ఆర్డినెన్స్ స్థానంలో ఈ కొత్త సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. దీనితో పాటు, 'ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల (సవరణ) బిల్లు-2026' కు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 'స్వర్ణాంధ్ర', 'వికసిత్ భారత్-2047' లక్ష్యాల సాధనలో భాగంగా సచివాలయ సిబ్బంది బాధ్యతలు, విధులను పునర్వ్యవస్థీకరించేందుకు ఈ సవరణ చేశారు.

Next Story