ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు. దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్స్ నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాలకు సంబంధించిన బిల్స్ కు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ సమావేశాలే చివరి సమావేశాలు. మళ్లీ కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖల నుంచి ఆర్ధిక శాఖ అధికారులు ప్రతిపాదనలు తీసుకున్నారు.