వైసీపీకి షాక్.. మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ రాజీనామా
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 April 2024 2:47 PM IST
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ రాజీనామా
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి పలువురు నేతలు రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో నాయకుడు వైపీపీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖన పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్కు పంపించారు.
గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నా.. డొక్కా మాణిక్య వరప్రసాద్కు పార్టీలో పెద్దగా గుర్తింపు లేదు. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నాయకులంతా ప్రచారంలో తలామునకలయ్యారు. కానీ.. ఈయన్నీ మాత్రం ఎవరూ ప్రచారానికి కనీసం పిలవడం లేదు. కొద్దిరోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డ విషయం అందరికీ తెలిసిందే. తనకు వైసీపీలో న్యాయం అందడం లేదనీ.. సరైన గుర్తింపు దక్కడం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే ఒక్కసారి అయినా జగన్ను కలిపించాలని ఆయన వేదిపై ఉన్న నాయలకును వేడుకున్నారు. ఇక ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ మరింత దూరం పెట్టింది.
డొక్కా మాణిక్యరావు 2004లో కాంగ్రెస్లో చేరారు. అప్పుడు తాడికండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మరోసారి 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత మూడు రాజధానుల బిల్లు సమయంలో వైసీపీలో చేరారు. 2024లో వైసీపీ నుంచి టికెట్ వస్తుందని డొక్కా ఆశపడ్డారు కానీ.. ఫలితం దక్కలేదు. దాంతో.. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే సీట్ల పంపకాలు పూర్తయ్యి.. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇక ప్రచారంలో ఎవరి తరఫున పాల్గొంటారనేది ఆసక్తికరంగా మారింది.