ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 12 April 2024 12:30 PM IST
ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్తో పాటు.. సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను కూడా ఒకేసారి విడుదల చేశారు. ఈమేరకు రిజల్ట్స్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పారు.
ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్లో 67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఇక ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి సప్లిమెంటరీ పరీక్షలను రాసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని అధికారులు చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశంలో.. మనస్థాపంతో ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని అధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు అలాంటి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాలనీ.. విద్యార్థులకు అండగా నిలవాలాని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక మరోవైపు ఫలితాల్లో ఏవైనా అనుమానాలు ఉంటే.. అలాంటి విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.