ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 50శాతం రాయితీతో రుణాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on  27 Aug 2024 1:50 AM GMT
andhra pradesh, govt, good news, nomadic tribes,

 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 50శాతం రాయితీతో రుణాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. పేద వర్గాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. తాజాగా రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని అట్టడుగున ఉన్న సంచార, విముక్తి జాతులకు చెందిన వారికి అండగా నిలబడేందుకు కార్యక్రమం చేపడుతోంది. వారికి జీవనోపాధి కల్పించేందుకు ఆర్థిక భరోసా అందించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు బీసీ సంక్షేమ అధికారులు కార్యాచరణను కూడా రూపొందించారు. రాష్ట్రంలో 42 సంచరా, విముక్తి జాతుల వారు ఉన్నారని ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో 36 జాతాలు వారు బీసీ ఏ విభాగంలో ఉన్నారు.. వారందరి పరిస్థితులు, వారిని ఎలా ఆదుకోవాలి, వారు ఏం కోరుకుంటున్నారు వంటి అంశాలను గుర్తించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోనున్నారు.

సంచార, విముక్తి జాతులకు చెందిన వారికి ఉపాధి కల్పనతోపాటు.. వారి పిల్లల విద్యకు కూడా చేయూత అందించేలా కసరత్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీరికి 50 శాతం రాయితీతో రుణాలిచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఏడాదికి 15 వేల మంది చొప్పున 5 ఏళ్లలో 70 వేల మందికి అండగా నిలిచేలా చర్యలు చేపడుతున్నారు. సంచార జాతులకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమల్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

ముందుగా సంచార, విముక్తి జాతుల వారిని డ్వాక్రా సంఘాల తరహాలో గ్రూపులుగా విభజించాలని భావిస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన ఒక్కో సంఘంలో 10 నుంచి 20 మంది సభ్యులుగా ఉండొచ్చు. సంచార, విముక్తి జాతుల వారికి శిక్షణ, అవగాహన కల్పించేందుకు.. ఒక్కో సంఘానికి రూ. 10 వేల చొప్పున అవసరమవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ మొత్తాన్ని భరించనుంది. ఈ శిక్షణ తర్వాత వారు ఎంపిక చేసుకునే ఉపాధికి రుణ సదుపాయాన్ని ఎన్‌బీసీఎఫ్‌డీసీ ద్వారా కల్పిస్తారు. రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాలను కూడా అందజేస్తారు. ఇందులో కూడా 50 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూపంలో భరిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో కట్టుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

Next Story