ఏపీలో వీఆర్‌ఏలకు గుడ్‌న్యూస్, డీఏ పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలకు గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  3 Feb 2024 1:24 AM GMT
andhra pradesh, govt, good news,  vra ,

 ఏపీలో వీఆర్‌ఏలకు గుడ్‌న్యూస్, డీఏ పెంపు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం వీఆర్‌ఏలు 19,359 మంది డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, రూ.300 నుంచి రూ.500కు డీఏ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారం నుంచే పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగాల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

తాజాగా వీఆర్‌ఏలకు డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాట్సాప్‌ గ్రూపుల్లో తన పేరు మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనీ.. రిటైర్మెంట్ రెండేళ్లు పెంచడం సహా పలు అంశాలపై ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారని చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదనే అన్నారు వెంకట్రామిరెడ్డి. ఈ పదవీ విరమణ వయసు పెంచుతారనే వార్తలను ఉద్యోగులెవరూ నమ్మొద్దని ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి కోరారు.

మరోవైపు ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరినట్లు వెంకట్రామిరెడ్డి చెప్పారు. పీఆర్సీ, డీఏ బకాయిలు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశామని వెల్లడించారు. వచ్చే వారంలో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్లు ఈ అంశాలపై చర్చలు జరుపుతారనీ.. ఆ సమావేశం తర్వాత ఐఆర్‌ ప్రకటన సహా ఇతర డిమాండ్లపై సానుకూల ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ ఇస్తుందనే నమ్మకం తనకు ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు.

Next Story