అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 7:03 AM IST
అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాజధానితో పాటుగా రైతులకు సంబంధించిన పలు విషయాలపై కీలక నిర్ణయాలను తీసుకుంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అమరావతి, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ అంశాలను ప్రకటించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హ్యానెస్ట్ ప్లాట్లన్నీ ఒక్క గంటలోనే అమ్ముడు పోయాయన్న విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కానీ.. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ మేరకు నష్టాన్ని పూడ్చేలా విధానాలను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. అమరావతి రైతులకు సెప్టెంబర్ 15వ తేదీ లోగా వార్షిక కౌలును జమ చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందనీ.. అందుకే సెప్టెంబర్ 15వ తేదీలోగా డబ్బలు అందిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ అమరావతి రైతులకు పెండింగ్లో పెట్టిన రూ.175 కోట్లను చెల్లిస్తామన్నారు. ఈ ఏడాదిలో ఇవ్వాల్సిన రూ.225 కోట్లను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో నిర్మాణాలపై సెప్టెంబర్ మొదటి వారంలో ఐఐటీ చెన్నై, హైదరాబాద్ల నుంచి నివేదికలు వస్తాయనీ.. 2025 జనవరి నాటికి అన్ని పనులు పునఃప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ చెప్పారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు గతంలో రూ.700 కోట్లతో ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించామన్నారు మంత్రి నారాయణ. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే రూ.930 కోట్లు అవసరం ఉందన్నారు. సీఆర్డీఏ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. ప్రభుత్వానికి భారమైనా హ్యాపీనెస్ట్ పూర్తి చేసి బుక్ చేసుకున్నవారికి అందిచాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు మంత్రి నారాయణ.