ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణ, సిబ్బంది నమూనా స్థిరీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కీలక సవరణలు చేస్తూ జిఓ 60 (GO 60) జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. దీని ప్రకారం గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శుల వేతన శ్రేణిని తగ్గిస్తూ సవరణలు చేశారు. గతంలో పేర్కొన్న రూ. 28,280 – రూ. 89,720 పే-స్కేల్ను మార్చి, ప్రస్తుతానికి రూ. 25,220 – రూ. 80,910 గా ఖరారు చేశారు.
గత ఏడాది నవంబర్లో జారీ చేసిన జిఓ 91 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శులకు గ్రేడ్-3గా పదోన్నతి కల్పిస్తూ వేతన స్కేల్ను నిర్ణయించారు. అయితే, ఆ సమయంలో పే-స్కేల్ నమోదులో సాంకేతిక పొరపాట్లు దొర్లాయని, అందుకే ఇప్పుడు వాటిని సరిచేస్తూ కొత్త జిఓ విడుదల చేసినట్లు ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సవరణలను తక్షణమే అమలు చేయాలని సంబంధిత శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లు మరియు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖరారు చేసిన వేతన శ్రేణిని తగ్గించడం అన్యాయమని, వెంటనే సవరణ జిఓ 60ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరియు పోరాటాలకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.