సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  10 April 2024 6:52 AM GMT
andhra pradesh, election, ycp, cm jagan, pothina mahesh,

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ నుంచి టికెట్‌ దక్కని పలువురు నాయకులు తమ సొంత పార్టీలకు గుడ్‌బై చెబుతున్నారు. మంగళవారం జనసేన పార్టీకి పోతిన మహేశ్‌ షాక్‌ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. అంతేకాదు.. పొత్తు అంశంపై స్పందిస్తూ పవన్ కల్యాణ్‌పై పోతిన మహేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక తాజాగా పోతిన మహేశ్‌ సీఎం జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పోతిన మహేశ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేశ్‌రెడ్డి కూడా వైసీపీ పార్టీలో చేరారు. వీరికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. విజయవాడ వెస్ట్‌ అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ టికెట్‌ ఆశించారు పోతిన మహేశ్. కానీ.. ఆ టికెట్‌ పొత్తుల భాగంగా జనసేన పార్టీకి రాలేదు. పొత్తు పెట్టుకోవడం వల్లే జనసేనకు అసెంబ్లీ స్థానాలు తక్కువయ్యాయనీ.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై పోతిన మహేశ్ విమర్శలు చేశారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. అయినా గుర్తింపు దక్కకపోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. అందుకే జనసేన పార్టీకి రాజీనామా చేసినట్లు పోతిన మహేశ్ చెప్పారు.

కాగా.. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా బీజేపీ తీసుకుంది. అక్కడి నుంచి కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీకి టికెట్‌ ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందాడు పోతిన మహేశ్‌. ఈ క్రమంలోనే బుధవారం సీఎం జగన్ సమక్షంలో తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరాడు.


Next Story