జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో వీటిపై నిషేధం
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది.
By Srikanth Gundamalla
జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో వీటిపై నిషేధం
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే.. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇక ఫలితాల వెల్లడి సమయంలో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే జూన్ 4న పలు ఆంక్షలను విధించింది.
జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆ రోజున రాష్ట్రంలో ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా విక్రయాలు, వాడకంపై కూడా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలను ఉల్లంఘించినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి ఎన్నికల సంఘం. ఈ మేరకు జిల్లాల వారీగా ఎస్పీలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ సందర్భంగా పల్నాడు, మాచర్ల సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆయా ఉన్నతాధికారులపై చర్యలు కూడా తీసుకుంది.
ఇక కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్రంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ తర్వాత హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్న వారిపై ఫోకస్ పెట్టారు. వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు.. ఆయా చోట్లలో భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకూడదని బంకు యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పెట్రోల్ బాంబులు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.