అంతుచిక్కని వైరస్.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లను బలి తీసుకుంటోంది. వందల సంఖ్యలో పౌల్ట్రీ ఫామ్లలో లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. అప్పటి వరకు చలాకీగా ఉన్న కోళ్లు.. కొన్ని గంటల్లోనే ప్రాణాలు వదులుతున్నాయి. దీంతో పౌల్ట్రీ యాజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 15 రోజుల వ్యవధిలోనే సుమారు 40 లక్షలకుపైగా లేయర్, బ్రాయిలర్, నాటు కోళ్లు మృత్యువాత పడినట్టు సమాచారం. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. అంతకుముందు డిసెంబర్, జనవరి నెలల్లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని నాటు కోళ్లలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఇప్పుడు ఈ వైరస్ బ్రాయిలర్, లేయర్ కోళ్లపై పంజా విసురుతోంది.
అయితే లక్షల సంఖ్యలో కోళ్ల మరణానికి ఏ వైరస్ కారణం ? అనే అంశంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్న వెటర్నరీ అధికారులు.. 'మిక్స్డ్ స్ట్రెయిన్' వైరస్ కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్ని టెస్టుల్లో ఈ విషయం వెల్లడి కాగా.. మరింత లోతైన విశ్లేషణ, నిర్దారణ కోసం కోళ్ల రక్త నమూనాలను మద్రాస్ ల్యాబ్కి పంపించారు. మరికొన్ని శాంపిల్స్ను భోపాల్కు పంపించారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్డీగా భావించి పౌల్ట్రీ ఫామ్ల వద్ద అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హెచ్15ఎన్ వైరస్ వల్లే కోళ్లు మరణిస్తున్నట్టు మరికొందరు అధికారులు భావిస్తున్నారు.