పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి 9 లక్షల కొవిషీల్డ్ కొవిడ్ టీకా డోసులు గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో ఈ టీకా డోసులను రాష్ట్రానికి తరలించారు అధికారులు. విమానాశ్రయం నుండి వ్యాక్సిన్ డబ్బాలను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలిగినట్లయింది.
ఇదిలావుంటే.. కోవిడ్ సంక్షోభ సమయం, వ్యాక్సిన్ల కొరత తదితర సమస్యలను ఎదురీదుతూ ఏపీ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో కోటి మందికి ఫస్ట్, సెకండ్ డోసు టీకాలు అందించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 20 శాతం మందికి పైగా టీకాలు అందించింది. వ్యాక్సినేషన్లో దేశ సగటును దాటేసి ఏపీ దూసుకుపోతుంది.