మారుతీరావు ఆత్మహత్య చేసుకొనే పిరికివాడు కాదు
By Newsmeter.Network Published on 9 March 2020 2:56 PM IST
నేను అమ్మవాళ్లింటికి వెళ్లను.. అలా అని అమ్మ నా దగ్గరకు వచ్చి ఉంటానంటే వద్దనను.. ఆమె బాధ్యత నేనే తీసుకుంటా అని ప్రయణ్ సతీమణి అమృత అన్నారు. అమృత సోమవారం విలేకరులతో మాట్లాడారు.. మారుతీరావు ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని, ఒత్తిడిలో చనిపోయాడని అనుకోవట్లేదని పేర్కొంది. ఆయన ఆత్మహత్య వెనుక కుటుంబ కలహాలు కారణమై ఉంటాయని అమృత తెలిపింది.
మారుతీరావు, శ్రవణ్కు గొడవులు ఉన్నాయని, మారుతీరావును శ్రవణ్ కొట్టినట్లుకూడా తనకు తెలిసిందని అన్నారు. మారుతీరావు చనిపోయిన బాధ శ్రవణ్ ముఖంలో ఎక్కడైనా కనిపించిందా అని అమృత ప్రశ్నించారు. ఆయన నుంచి అమ్మకు ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. నాన్న చివరి కోరిక మేరకు తాను అత్యక్రియలకు వెళ్లానని, కానీ శ్రవణ్ కుతురు తనను నెట్టేసిందని, శ్రవణ్ తనను రాకుండా అడ్డగించేలా చేశాడని అన్నారు. దీంతో తాను చివరిసారిగా నాన్న మొఖం చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చిందని అమృత తెలిపారు.
తనకు మారుతిరావు ఆస్తిపై ఎలాంటి అవగాహన లేదని, తనకు ఆ ఆస్తి కావాలని కూడా అనుకోవటం లేదని తెలిపింది. ఆస్తికోసం కోర్టుకెళ్లే ఉద్దేశం కూడా లేదని అమృత స్పష్టం చేసింది. గతంలో మారుతీరావు తనను ఇంటికి రావాలని రాయబారం పంపించారని, అందుకు నేను ఒప్పుకోలేదన్నారు. వీలునామాలో శ్రవణ్ పేరు ఉంటే అనుమానం వస్తుందని తీయించారోఏమోనని అమృత పేర్కొన్నారు. తాను ప్రయణ్ చనిపోయినప్పుడే బలంగా ఉన్నానని, మారుతిరావు చనిపోయాడని తెలిస్తే ఎందుకు ఉండలేనని అన్నారు. ఒక్కసారి బాబు పుట్టాక అమ్మ వచ్చారని, కానీ తాను ఆమెకు బాబును చూపించలేదన్నారు. ప్రణయ్ హత్య తప్పితే నాకు వాళ్లతో ఇతర గొడవలేం లేవని, భర్తను కోల్పోతే భార్య ఎలా బాధపడుతుందో తనకు తెలుసని అన్నారు. మారుతీ రావు మరణంతో ఆమె ఒంటరి అయిందని, ప్రణయ్ లేకపోయినా నాకు అత్తమామ, కొడుకు అందరూ ఉన్నారని అమృత తెలిపింది.