నేటి నుంచి టిఫిన్, భోజనం ఉచితం
By తోట వంశీ కుమార్ Published on 13 April 2020 5:18 AM GMTకరోనా వైరస్(కొవిడ్-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధానికి దేశ వ్యాప్త లాక్డౌన్ను విధించారు. లాక్డౌన్తో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో రోజు వారి కూలీల పరిస్థితి దారుణంగా మారింది. రెక్కాడితేగాని డొక్కాడని ఆ పేదల బతుకుల్లో కరోనా చిచ్చుపెట్టింది.
ప్రస్తుతం బయటికి వెళ్లి పనిచేసుకోని పరిస్థితి. దీంతో వలసకూలీలు, రిక్షా వాలా, ఆటోడ్రైవర్ల, పుట్ పాత్ వాసులు ఆహారం లేక ఆగచాట్లపాలవుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమిళనాడులో పేదల కడుపు నింపడం కోసం అమ్మ క్యాంటిన్లను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అతి తక్కువ ధరలకే అక్కడ టీ, టీఫిన్, భోజనాన్ని అందిస్తున్నారు. తాజాగా రాయపురం శాసనసభ నియోజకవర్గంలోని అమ్మ క్యాంటీన్లలో సోమవారం నుంచి లాక్డౌన్ ఎత్తివేసే వరకు టిఫిన్, భోజనాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి జయకుమార్ ప్రకటించారు.
ఆహారం ఆగచాట్లు పుడుతున్న పుట్పాత్వాసులు, వలసకూలీలు, రిక్షావాలా తదితరుల ఆకలిని తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నాం భోజనం, సాయంత్రం టిఫిన్ ను అమ్మ క్యాంటిన్ల ద్వారా ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.
రాయపురం ఎమ్మెల్యేగా, మత్స్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను.. ఆర్ఎన్ఆర్ఎం ప్రభుత్వ ఆస్పత్రి, ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తున్నారు.