కరోనా ఎఫెక్ట్‌.. రైల్వేశాఖ సంచలన నిర్ణయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2020 6:28 AM GMT
కరోనా ఎఫెక్ట్‌.. రైల్వేశాఖ సంచలన నిర్ణయం

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి భారీన పడి 4,500మందికి పైగా మ్యతువాత పడగా.. లక్షకు పైగా దీని బాధితులు ఉన్నారు. అప్రమత్తమైన భారత్‌.. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలోని ఏసీ బోగీల్లో ఉండే కర్టెన్లు తొలగించాలని నిర్ణయించింది. అదే విధంగా ప్రయాణికులకు అందించే బ్లాంకెట్లను కూడా తొలగించింది. ఇకపై రైలులో ప్రయాణం చేసే వారు ఎవరికి వారే సొంతంగా బ్లాంకెట్లను తెచ్చుకోవాలని రైల్వే శాఖ అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

'ఏసీ బోగీల్లో వినియోగించే కర్టెన్లు, బ్లాంకెట్లను ఓ ట్రిప్ పూర్తి కాగానే ఉతికి శుభ్రపరచడానికి వీలుండదని, ఈ కారణంతో వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని' రైల్వే శాఖ పీఆర్వో తెలిపారు. కేవలం బ్లాంకెట్లు మాత్రమే కాకుండా, ప్రయాణికులకు అవసరమైన దుప్పట్లు, ఇతరత్రా వాటిని ఎవరికి వారే తెచ్చుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ దిండు, దుప్పట్లు , బెడ్ షీట్లు అందిస్తుంది. దీంతో ఏసీ టికెట్లు బుక్ చేసుకొనే వారికి వాటిని క్యారీ చేసే భారం తప్పుతుంది. అయతే కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఎవరికి వారు దుప్పట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. కరోన విజృంభణను తట్టుకొని నిలిచేందుకు భారత్‌ ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, స్విమింగ్‌ ఫూల్స్‌ను ఈ నెల చివరి వరకు మూసివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు అవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టులోనూ ముంద జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించే ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలను రూపొందిస్తోంది.

తొలుత కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను, ఆస్పత్రుల్లో అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత ఆ రెండు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా.. వైరస్‌ సోకిన వారిని క్వారంటైన్‌లో ఉండే 30 రోజుల పాటు ఆహారం, వస్త్రాలు, వైద్య సేవలు అందించడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడుకోవచ్చని తెలిపారు. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న మహ్మమారి కరోనా వైరస్‌ను.. విపత్తుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నమూనాల సేకరణ, తనిఖీలు, స్ర్రీనింగ్‌ కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద నిధులను ఖర్చు చేయనున్నారు.

Next Story