ముంచుకొస్తున్న గడువు.. ఆ 68 వేల మంది భారత టెకీలకు నిద్ర కరువు
By అంజి Published on 18 Feb 2020 6:02 AM GMTఅమెరికాలో ఉంటున్న 68 వేల మంది భారత టెకీలు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కారణం.. హెచ్ 1బీ వీసా. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అర్హతతో 68 వేల మంది అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా ఓటీపీ కాల వ్యవధి మూడేళ్లు మాత్రమే.. ఇప్పుడు ఆ గడువు ఏప్రిల్ చివరి వారంతో ముగియనుంది. ఆ లోపు హెచ్ 1బీ వీసా రాకపోతే.. ముళ్లె, ముఠా సర్దుకొని భారత్ రావాల్సిందే. లేదంటే తిరిగి ఎంఎస్ లేదా పీహెచ్డీలో అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఓపీటీపై ఉన్న 68 వేల మంది భారతీయుల్లో 20 నుంచి 24 వేల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు ఉన్నారు.
అయితే ఈ సారి కూడా వీసా రాదేమోనన్న ఆందోళనలో మన టెకీలు.. అక్కడ సరిగా తినడం లేదట. ఇప్పుడిదే వారికి చివరి అవకాశం. కాగా ఇప్పటికే ఈ 68 వేల మంది టెకీలకు రెండు సార్లు వీసా మిస్ కావడం గమనర్హాం. కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తిరిగి ఎంఎస్లో చేరడానికి ఆలోచిస్తున్నారు. ఒక వేళ వీసా రాకపోతే మాత్రం తిరిగి ఖచ్చితంగా భారత్కు రావాల్సి ఉంటుంది. 214 నుంచి రెట్టింపు సంఖ్యలో ఉన్నత విద్య కోసం భారత్ నుంచి చాలా మంది విద్యార్థులు అమెరికా వెళ్లారు.
కాగా 2015-16లో అమెరికాకు వెళ్లిన విద్యార్థులు.. ఇప్పుడు అక్కడ వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అమెరికా ప్రతి సంవత్సరం కంప్యూటర్ రంగంలో పని చేసే 85 వేల మందికి హెచ్ 1బీ వీసాలు ఇస్తోంది. కాగా అమెరికాకు ఓటీపీ మీద వచ్చి.. హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2016లోనే లక్ష దాటింది. ఈ సంవత్సరం ఆ సంఖ్య 1.5 లక్షలు దాటుతుందని న్యూయార్క్ హెచ్ 1బీ వ్యవహారాల నిపుణుడు నీల్ ఏవెయిన్ రిచ్ అంచనా వేస్తున్నాడు. ఈ సంఖ్య రెట్టింపైనా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన అంటున్నారు. కొందరు టెకీలు మాత్రం అమెరికాలో ఉండేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. డబుల్ డిగ్రీ చేసేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారు.
ఉన్నత విద్య కోసం అమెరికా వస్తున్న వారు ఉపాధి అవకాశాలను లక్ష్యంగా చేసుకొని వస్తున్నారా లేక విజ్ఞానం పెంపొందించుకోవడం కోసం వస్తున్నార అన్న అంశంపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఫ్రొఫెసర్ బారీ విలియమ్స్ అన్నారు.