ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని
By Newsmeter.Network Published on 14 Jan 2020 10:16 AM GMTరాజధాని అమరావతిలో రైతుల ఆందోళనలకు టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని సంఘీభావం తెలిపారు. మందడంలో రైతులు చేస్తున్న దీక్షలో సుహాసిని పాల్గొన్నారు. రైతుల దీక్షకు మద్దుతు ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం తక్షణమే మూడు రాజధానుల అంశాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై పోలీసుల దాడులు హేయమైన చర్యగా ఆమె పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై పోలీసు దాడులను సుహాసిని తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధానిగా కొనసాగే వరకు ఉద్యమించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
అమరావతిని కాదని రాజధానిని మార్చడం ఎవరి వల్ల కాదని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని సుహాసిని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్లకు పాల్పడలేదని, ఒక వేళ పాల్పడినట్లైతే చర్యలు తీసుకోవచ్చని సుహాసిన అన్నారు. రాష్ట్రాలకు రాజధానులు ఒక్కొక్కటే ఉంటాయన్నారు. పోలీసులు మహిళల పట్ల అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోస్టన్ కమిటీ, జీఎన్రావు కమిటీలు బోగస్ కమిటీలు అంటూ సుహాసిని విమర్శించారు.