కరోనాను కట్టడి చేసే మాలిక్యూల్ ఇప్పుడు మన హైదరాబాద్ లాబ్ లోనే తయారు

By రాణి  Published on  29 Feb 2020 6:54 AM GMT
కరోనాను కట్టడి చేసే మాలిక్యూల్ ఇప్పుడు మన హైదరాబాద్ లాబ్ లోనే తయారు

హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కావలసిన మౌలిక మాలిక్యూల్ ను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించింది. కరోనా వ్యాక్సిన్, లేదా మందులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఈ మాలిక్యూల్ ను శాస్త్రీయ భాషలో యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇన్ గ్రీడియంట్ లేదా క్రియాశీల ఔషధ పదార్థం అంటారు.

ఒక సుప్రసిద్ధ ఫార్మా కంపెనీ ఇటీవలే ఐఐసీటీ శాస్త్రవేత్తలను ఈ మాలిక్యూల్ ను తయారు చేసే విషయంలో సంప్రదించింది. తమకు అవసరమైనప్పుడు ఎక్కువ మోతాదులో యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇన్ గ్రీడియెంట్ ను ఉత్పాదన చేసే సామర్థ్యం ఉందా లేదా అన్న విషయంలోనూ కంపెనీ శాస్త్రవేత్తలతో చర్చించింది. ఈ విషయాన్ని సీ ఎస్ ఐ ఆర్ ఐఐసీటీ డెరెక్టర్ డా.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. ఇప్పటివరకూ తమకు ఫార్మా సంస్థ ఉంచి ఆర్డర్ లేదా ఇండెంట్ రాకపోయినా, భారీ మోతాదులో ఉత్పాదనకు తాము సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. దీనికి పైరోలో ట్రయాజిన్, రిబోస్ అనే రెండు మాలిక్యూల్స్ అవసరమని, వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, భారత ప్రభుత్వం అత్యవసరంగా అడిగినా అందించగలిగేలా సన్నాహాలు చేస్తున్నామని డా. చంద్రశేఖర్ తెలిపారు.

అయితే కరోనా వైరస్ కోవిడ్ 19 చాలా వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కారణంగా కొన్ని ఫార్మా కంపెనీలు సరైన డ్రగ్ ట్రయల్స్ నిర్వహించకుండానే మందులను బజార్లోకి విడుదల చేసే ప్రమాదం ఉందని కూడా ఆయన తెలిపారు. తొందరపాటులో ఔషధం తాలూకు రిస్క్ ల కన్నా , అది ఎంత వేగంగా రోగాన్ని నిరోధిస్తుందన్న విషయానికే ప్రాధాన్యత ఇచ్చే ప్రమాదం కూడా ఉందని ఆయన అన్నారు. ఈ దిశగానే ముందస్తుగా సిద్ధంగా ఉండేందుకే తాము ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్, మందును కనుగునే దిశగా భాఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ ప్రయత్నాల్లో భుజం కలిపి పనిచేస్తున్నట్టయింది. రెమ డెసివిర్ పేరిట గతంలో ఎబోలా వైరస్ పై పనిచేసిన ఔషధాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి దానిని ఉపయోగించేందుకు ఒక అమెరికన్ ఫార్మా కంపెనీకూడా సిద్ధమౌతోంది.

Next Story