ఈ యాప్ ఉంటేనే రైలెక్కనిస్తారు..!
By సుభాష్ Published on 12 May 2020 9:45 AM GMTమే 12వ తేదీ (నేటి నుంచి) రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు మొత్తం 30 రైళ్లను నడపనున్నట్లు స్పష్టం చేసింది. ఈ రోజు రైల్వే అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలవనున్నారు. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, పాట్నా, హౌరా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరునంతపురం, మడ్గావ్, ముంబైల్ సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లను నడపనుంది.
స్పెషల్ ట్రైన్స్ లో ఎవరైతే ప్రయాణాలు చేయాలని అనుకుంటూ ఉన్నారో వారందరూ 'ఆరోగ్యసేతు యాప్' ను తప్పకుండా ఉపయోగించాలని భారతీయ రైల్వే తెలిపింది. స్పెషల్ ట్రైన్ లు ఎక్కాలంటే ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లోనూ ఈ యాప్ ఉండాలని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్వీట్ చేసింది. 'భారతీయ రైల్వే కొన్ని ప్యాసెంజర్స్ ట్రైన్స్ ను మొదలుపెడుతోంది. ప్యాసెంజర్లు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ ను మొబైల్ ఫోన్స్ లో ఉంచుకొని రైలు ప్రయాణం మొదలు పెట్టాలి" అని ట్వీట్ లో ఉంది.
భారత ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రుల మీటింగ్ ముగిశాక ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ అంతకుముందు ప్యాసెంజర్ల ఫోన్ లో ఈ యాప్ లేకుండా ఉంటే.. స్టేషన్ కు వచ్చాక అయినా ప్రతి ఒక్క ప్యాసెంజర్ ఫోన్ లోనూ ఇన్ స్టాల్ చేయించనున్నారు. ఆరోగ్య సేతు యాప్ ను ఇప్పటి వరకూ 9.8 కోట్ల స్మార్ట్ ఫోన్ లలో ఇన్ స్టాల్ చేయించారు.