తెలంగాణలో కొత్తగా మరో 7 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 29 April 2020 2:37 PM GMTదేశంలో కరోనా విజృంభిస్తోన్నప్పటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యింది. ఇవాళ కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో 1,016కు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారీన పడి 25 మంది మరణించారు. ఈ వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 35 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 409 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇదిలా ఉంటే.. జిల్లాల్లో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆదివారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సోమవారం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సోమవారం కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మంగళవారం ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 6 కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం.