రూ.50 కోసం.. ఆరవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
By Newsmeter.Network Published on 28 Feb 2020 4:40 PM IST
ప్రాజెక్టు వర్క్ కోసం అని ఆ బాలిక తల్లిదండ్రులను రూ.50 అడిగింది. అయితే వారు డబ్బులు ఇవ్వకుండానే పనులకు వెళ్లి పోయారు. మనస్థాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత చేసుకుంది. కన్నవారికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
నరసింహ, లక్ష్మీ దంపతులు చేర్యాల మండలం మస్త్యాలలో నివసిస్తున్నారు. వీరికి ఓ కుమారై ఉంది. హన్సిక(11) స్థానిక మోడల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. పాఠశాలలో ప్రాజెక్టు వర్క్ చేసుకురమ్మని చెప్పారు. దీంతో.. హన్సిక తల్లిదండ్రులను రూ.50 అడిగింది. స్కూల్లో ప్రాజెక్టు ఇచ్చారని.. అందుకు డబ్బులు కావాలని చెప్పింది.
కాగా.. ఉదయాన్నే తల్లిదండ్రులు మరిచిపోయి.. డబ్బులు ఇవ్వకుండానే పనులకు వెళ్లిపోయారు. దీంతో బాలిక మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఉన్న పురుగుల మందు డబ్బాను తీసుకుని తాగేసింది.చుట్టు పక్కల ఉన్న వారు గమనించి.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఇంటికి చేరుకుని బాలికను ప్రభుత్వాసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ.. బాలిక మృతి చెందింది. రూ.50కోసం చిన్నారి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.