భారత్లో పెరుగుతున్న కరోనా మరణాలు.. 24 గంటల్లో 62 మంది
By తోట వంశీ కుమార్ Published on 28 April 2020 8:15 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించినప్పటికి కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 62 మంది మరణించడంతో పాటు కొత్తగా మరో 1543 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒక్క రోజులో ఇంత ఎక్కువగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో 29,435 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 934 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదైన కేసుల్లో 6,869 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 21,632 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 8,590 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 369 మంది మరణించారు. గుజరాత్ లో 3,548 కేసులు నమోదు కాగా.. 162 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్లో 2,168 కేసులు నమోదు కాగా.. 110 మంది చనిపోయారు. ఇక దేశ రాజధాని డిల్లీలో ఇప్పటి వరకు 3,108 కేసులు నమోదు కాగా.. 54 మంది మృతి చెందారు.