పంజాబ్లో రేపటి నుంచి అసెంబ్లీ.. 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా
By సుభాష్ Published on 27 Aug 2020 2:30 AM GMTపంజాబ్ లో 23 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. అయితే 28వ తేదీ నుంచి పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో సభను ఎలా నిర్వహిస్తామని ఆయన అంటునన్నారు. నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయంపై సభలో చర్చించాల్సి ఉంటుందని, కరోనా సమయంలో వీటిని వాయిదా వేసేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా సుంప్రీం కోర్టులో పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ విషయం బయటపడిందన్నారు.
కాగా, 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీలో ఇప్పటికే 23 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటంతో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో 117 మంది ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా నెగిటివ్ వస్తేనే అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు వీలుంటుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బీజేపీయేతర ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆన్లైన్ సమావేశంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంత భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకితే, ఇక సాధారణ ప్రజల సంగతిని ఉహించవచ్చని ఆయన వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా, లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న నీట్, జేఈఈ పరీక్షలను కేంద్రం వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ, ఇతరర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ కలిసి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.