భారత్లో చిక్కుకున్న వారిని హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఇతర దేశాలకు తరలింపు
By సుభాష్ Published on 18 April 2020 4:55 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా తమతమ ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. అలాగే భారతీయులు కూడా విదేశాల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతుంటే.. మన దేశంలో కూడా ఇతర దేశాల వారు చిక్కుకుని ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాగా, జీఎంఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్లో చిక్కుకున్న ఇతర దేశాల వారిని సరిహద్దులు దాటిస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొందరు యూకే జాతీయులను వారి దేశానికి తరలించేందుకు బ్రిటిష్ ఎయిర్ వేస్కు చెందిన ప్రత్యేక విమానం హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చింది. బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు నిన్న సాయంత్రం 4.59 గంటలకు చేరుకుంది. ఇక సాయంత్రం 6.46 గంటలకు భారత్లో చిక్కుకున్న 136 మంది యూకే జాతీయులను ఎక్కించుకుని బహ్రెయిన్కు వెళ్లి, అక్కడి నుంచి లండన్కు చేరుకుంటుంది.
ఈ ప్రయాణికుల కోసం పూర్తిగా శాటిజైజ్ చేసిన ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ను సిద్ధంగా ఉంచారు. యూకే డిప్యూటీ హై కమిషన్, తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో యూకే జాతీయులంతా హైదరాబాద్లోని వివిధ ప్రదేశాల నుంచి నిన్నమధ్యాహ్నం నుంచి విమానాశ్రయానికి రావడం ప్రారంభించారు. టెర్మినల్కు వచ్చే ముందు వారందరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీ, అమెరికా, యూకేలకు చెందిన సుమారు 600 మందిని వారి స్వదేశాలకు పంపారు.
అంతేకాదు ఒక వైపు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిరంతరం తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూనే మరో వైపు సప్లై చెయిన్ విమానాలు నడిపేందుకకు నిరంతరం సహకరిస్తోంది. దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువులను సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కృసి చేస్తోంది. గ్రౌండ్ హ్యండ్లరు, ఫార్వర్డర్లు, కస్టమ్స్ హౌజ్ ఏజెంట్లు, రెగ్యులేటర్లు, రాష్ట్ర పోలీసులు, కార్గో ట్రేడ్ అసోసియేషన్లతో కలిసి అత్యవసర వస్తువలైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకులకు సంబంధించిన వస్తువులు నిరంతరం రవాణా కొనసాగించేందుకు ఎంతో కృషి చేస్తోంది.