జగన్కు పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కార్నివాల్
By Newsmeter.Network
విశాఖ పర్యటనలో సీఎం వైయస్ జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. దీనిలో భాగంగా విశాఖ ఉత్సవ్ ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. 4 కి.మీ మేర సాగిన కార్నివాల్ లో యువతీ యువకులు, విద్యార్థులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయ నృత్యాలు, కర్రలపై నడక, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, వివిధ నృత్యాలు నగర వాసులను అమితంగా ఆకట్టుకున్నాయి.
విశాఖ విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ జంక్షన్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, రైల్వేస్టేషన్ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేరు, కురుపాం టూంబ్, అప్పూ ఘర్ జంక్షన్ మీదుగా కైలాసగిరి వరకు దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మానవహారంలా... నిలబడి సీఎంకు కృతజ్ఞతా పూర్వక స్వాగతం పలికారు. సీఎం వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు. పలు చోట్ల రోడ్డు మీదకు దూసుకువచ్చి కారులో ఉన్న సీఎంతో సెల్ఫీ కోసం కూడా ప్రయత్నించారు. అతి కష్టం మీద పోలీసులు వారిని ఆపారు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఓపికతో నిలబడి ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడంతో పాటు, గాలిలో బెలూన్లు వదిలి అభిమాన నేతకు స్వాగతం పలికారు. వీటన్నింటి మధ్య సీఎం కాన్వాయి ముందుకు సాగింది.