కీకారణ్యంలో మహిళను వివస్ర్తను చేసి...

By రాణి  Published on  3 Feb 2020 7:13 AM GMT
కీకారణ్యంలో మహిళను వివస్ర్తను చేసి...

ముఖ్యాంశాలు

  • నల్లమలలో మరణాల వెనకున్న మిస్టరీ ఏంటి ?
  • కేసులను దర్యాప్తు చేయడంలో విఫలం

అదొక కీకారణ్యం. అక్కడ జరుగుతున్న మరణాలొక అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అస్తిపంజరాలు, మృతదేహాలను గుర్తించడమే గానీ..ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితి పోలీసులది. తాజాగా నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో మహారాష్ర్టకు చెందిన మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ పక్కనే క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉండటంతో...క్షుద్రపూజలు చేసి మహిళను బలిచ్చారని అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అమవాస్య రోజున క్షుద్రపూజలు చేసి నరబలి ఇస్తే అతీత శక్తులొస్తాయనేది కొందరి మూఢ నమ్మకం. ఇదే అక్కడ బలంగా ప్రచారంలో ఉంది. దీనికి మరింత బలాన్ని చేకూర్తింది ఆదివారం జరిగిన ఈ సంఘటన.

టెక్నాలజీ VS మూఢ నమ్మకాలు

ఇంత టెక్నాలజీ ఉన్నా ఇంకా మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మేవారు కూడా ఉన్నారు. అలాంటి వారున్నారు కాబట్టే..ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అభయారణ్యంలో ఉన్న అమ్రాబాద్ మండలి ఈగలపెంటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతట్టు అటవీప్రాంతంలో మృతదేహం ఉన్నట్లుగా సమాచారం రావడంతో..పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమారు 50 ఏళ్ల వయస్సున్న మహిళ మృతదేహాన్ని అక్కడ గుర్తించారు. క్షుద్రపూజలు చేసి, మహిళను వివస్ర్తను చేసి, గొంతు నరికి దారుణంగా హత్య చేసినట్లుగా అక్కడి ఆనవాళ్లు చెబుతున్నాయి. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డ్ ఆధారంగా హత్యకు గురైన మహిళ మహారాష్ర్ట థానే జిల్లాకు చెందిన శాంతిరవి ముదిలియార్ గా గుర్తించారు. మృతురాలికి సంబంధించిన వివరాలు దొరకడంతో కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు ఈ ఘటన గురించి మహారాష్ర్ట పోలీసులకు వివరాలు ఇచ్చి, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. 2017 నవంబర్ 21న కూడా అక్కమహాదేవి గుహల పరిసర ప్రాంతంలో అస్థిపంజరాలు దొరికాయి. అప్పుడు కూడా అక్కడ క్షుద్రపూజలు జరిగినట్లుగా ఆనవాళ్లున్నాయి. పసుపు, కుంకుమ, పువ్వులు, నిమ్మకాయలు ఘటనా ప్రాంతంలో లభించాయి.

లోతట్టు ఆటవీ ప్రాంతంలో అక్కమహాదేవి గు హలను సందర్శించి అక్కడి నుంచి శ్రీశైలం మ ల్లన్నను దర్శించుకునేందుకు కర్ణాటక, మహారా ష్ట్రలకు చెందిన భక్తులు ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా క్రూరమృగాలు సంచరించే ఈ ప్రాంతం గుండా సమూహాలుగా కాలినడకన చేరుకుంటారు. కానీ ఈ మహిళ ఒంటరిగా ఆ గుహల నుంచి వెళ్లే అవకాశాలు తక్కువ. కుటుంబ సభ్యులతో వచ్చి ఉంటే గనుక..తమ కుటుంబంలో వ్యక్తి కనిపించడంలేదని వారు ఫిర్యాదు అయినా ఇవ్వాలి. కానీ అలా ఇవ్వలేదు. అంటే ఈ మహిళను ఎవరో అక్కడికి తీసుకొచ్చి బలి ఇచ్చారా ? అని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు 10 రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పుడు దొరికిన మృతదేహం ఎవరిదో ఆధార్ కార్డ్ ఆధారంగా గుర్తించారు సరే..అంతకు ముందు ఎన్నో హత్యలు జరిగాయి కదా. మరి వాటి సంగతేంటి ? కీకారణ్యంలో జరుగుతున్న హత్యల వెనుకున్న మిస్టరీ మాత్రం వీడటం లేదు. ఎక్కడెక్కడో హత్యలు చేసి మృతదేహాలను నల్లమలకు తీసుకొచ్చి పడేస్తుండటంతో..ఆ కేసులను చేధించడం పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. 2019లో శ్రీశైలం డ్యాం సమీపంలో వ్యక్తి హత్యకు గురికాగా..ఇప్పటి వరకూ చంపబడిన వ్యక్తి ఎవరో తెలియలేదు. హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యం కాలేదు.

Next Story