భార్య, ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. ఇది తెలిసి భర్త..

By Newsmeter.Network  Published on  11 Feb 2020 9:11 AM GMT
భార్య, ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. ఇది తెలిసి భర్త..

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి భార్య పురుగుల మందు తాగింది. విషయం తెలిసిన భర్త.. ప్రియురాలితో ఇక మన మధ్య ఈ బంధం ఉందని చెప్పాడు. మనస్తాపం చెందిన ప్రియురాలు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కాపాడబోయిన అతడు నదిలోకి దూకి గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నది వద్ద సోమవారం వెలుగు చూసింది.

అద్దంకి పట్టణం ఎన్టీఆర్‌ కాలనీలో వేణుబాబు(45), ధనలక్ష్మి నివాసం ఉంటున్నారు. వేణుబాబు బేల్దారి పని చేసేవాడు. అద్దంకి మండలం నాగులపాడుకు చెందిన గారపాటి వెంకట్రావుకు, చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన మల్లేశ్వరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. వెంకట్రావు హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంటు వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తుండగా భార్య మల్లేశ్వరి బేల్దారి కూలీగా పనిచేసేది. బేల్దారి పని చేసేటప్పుడు వేణుబాబుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

మూడు రోజుల క్రితం మల్లేశ్వరి హైదరాబాద్‌ నుంచి అద్దంకి వచ్చి ప్రియుడు వేణును కలిసింది. వేణు ఆదివారం సినిమాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం ఓ సంచిలో మల్లేశ్వరితో కలిసి తీయించుకున్న ఫొటో చూసిన భార్య.. భర్తకు ఫోన్‌ చేసి ఇదేమిటని ప్రశ్నించింది. మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన బంధువులు ఆమె ఆస్పత్రిలో చేర్చించారు.

ఇదిలా ఉంటే.. వేణుబాబు, మల్లేశ్వరి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని చీమకుర్తి వెళ్లారు. భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిసి.. ఇద్దరూ అద్దంకి పయనమయ్యారు. మన ఇద్దరికి వేర్వేరుగా పెళ్లి అయ్యి.. పిల్లలు ఉన్నారని.. ఇక పై వివాహేతర సంబంధం కొనసాగించడం మంచికాదని మల్లేశ్వరితో మార్గమధ్యలో వేణు అన్నాడు. అప్పటికే వారు ప్రయాణిస్తున్న బైకు గుండ్లకమ్మ బ్రిడ్జిపైకి చేరుకుంది. క్షణికావేశానికి గురైన మల్లేశ్వరి బైకు నుంచి కిందకు దిగి గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

నదిలో మునిగిపోతున్న ఆమెను కాపాడేందుకు వేణు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేణు నదిలో గల్లంతయ్యాడు. ఓ యువకుడు ఆటో నుంచి తాడు తీసుకుని ఆమెకు అందించాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది అతికష్టం మీద ఆమెను కాపాడారు. పోలీసులు కొత్తపట్నం నుంచి రెస్క్యూ టీమ్‌ను పిలిపించి వేణును బయటకు తీశారు.

Next Story