వివేకా హ‌త్య కేసులో విచార‌ణ వేగ‌వంతం...ప‌లువురిని ర‌హ‌స్యంగా విచార‌ణ‌

By Newsmeter.Network  Published on  2 Dec 2019 4:13 PM GMT
వివేకా హ‌త్య కేసులో విచార‌ణ వేగ‌వంతం...ప‌లువురిని ర‌హ‌స్యంగా విచార‌ణ‌

ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు పై ద‌ర్యాప్తు వేగ‌వంతంగా కొన‌సాగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ కేసు విచార‌ణలో వెనుక‌బ‌డిన అధికారులు... మ‌ళ్లీ వేగ‌వంతం చేశారు. ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యులైన భాస్కర్‌ రెడ్డి, మనోహర్ రెడ్డిలను పోలీసులు రహస్యంగా విచారించారు. వీరితో పాటు పలువురు టీడీపీ నేతలను కూడా విచారించారు. వారు విచారిస్తున్నారు. మరో పది రోజుల పాటు వీరందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ ఏడాది మార్చి 15 న పులివెందులలోని తన స్వగృహంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో నిందితులెవరో, దోషులెవరో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు అప్పటి టీడీపీ స‌ర్కార్‌ ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేయ‌గా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ స‌ర్కార్ మరో సిట్ బృందం ఏర్పాటు చేసింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్ కుటుంబీకులతో పాటు దాదాపు 1300 మంది అనుమానితులను అధికారులు విచారించారు. కీలక అనుమానితులకు నార్కో పరీక్షలలో పాటు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. హత్య జరిగిన సమయంలో సాక్ష్యాధారాలు లేకుండా చేశార‌న్న‌ అభియోగంపై అరెస్ట్ అయిన నిందితులు.. ఆ తరువాత విడుదలై బయటే ఉన్నారు. ఇక వీరిలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story