వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విశాఖ జిల్లా భీమిలీ తీరంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  4 Sep 2024 6:30 AM GMT
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విశాఖ జిల్లా భీమిలీ తీరంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు. భీమిలి జోన్ పట్టణ సహాయ ప్రణాళిక అధికారి బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే బీచ్‌ ఒడ్డున హోటల్ కోసం వేసిన కాంక్రీట్‌ పిల్లర్స్‌, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు.

కూల్చివేతల సందర్భంగా అక్కడ పోలీసులు బారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రక్రియను ఎవరూ అడ్డుకోవడం లేదనీ.. దాంతో కూల్చివేతలు సజావుగా సాగుతున్నాయని అధికారులు చెప్పారు. తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందనీ.. బుధవారం సాయంత్రం వరకూ ఇది పూర్తవుతుందని జీవీఎంసీ అధికారులు చెప్పారు. కాగా.. గత ప్రభుత్వ హయాంలో పార్టీ ముఖ్యనేతలు ఇక్కడి భూములను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద స్థాయిలో అక్రమ నిర్మాణాలను కట్టారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో.. జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు. భీమిలి తీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు న్యాయస్థానం నిర్ధరించింది. వీటిని వెంటనే తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మేరకు అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు.



Next Story