నిజమెంత: ఆరెస్సెస్ కార్యకర్తలు దాడి చేస్తున్న ఫోటో అంటూ వైరల్

By సుభాష్  Published on  23 April 2020 2:44 PM GMT
నిజమెంత: ఆరెస్సెస్ కార్యకర్తలు దాడి చేస్తున్న ఫోటో అంటూ వైరల్

కోపోద్రిక్తులైన ఓ బృందం.. మెడలో కాషాయ వర్ణం ఉన్న గుడ్డ ముక్క, తలకు కాషాయం రిబ్బన్.. చేతుల్లో మారణాయుధాలు.. ఓ వ్యక్తిని బెదిరిస్తూ ఉన్న ఫోటో..! ఇది ఆరెస్సెస్ కార్యకర్తలు చేస్తున్న దురాగతాలని, అమాయకులపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆరెస్సెస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రభుత్వాన్ని గుప్పిట్లో తీసుకుందని ఓ మెసేజ్ ను జోడించి పలువురు తమ తమ అకౌంట్లలో పోస్టు చేస్తున్నారు.



ఈ ఫొటోకు మరికొన్ని ఫోటోలను జతచేసి ఆరెస్సెస్ మారణహోమానికి పాల్పడుతోందని.. స్టాప్ ఆరెస్సెస్ టెర్రరిజం ఇన్ ఇండియా అంటూ తెగ షేర్ చేస్తున్నారు. కొందరు ప్రముఖులు కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.



నిజమెంత:

వైరల్ అవుతున్న ఆ ఫోటో ఓ సినిమాలోని సన్నివేశం లోనిది. 2007 లో విడుదలైన 'పర్జానియా' సినిమాలోనిది. గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను చేయగా ప్రముఖ మూవీ సైట్ 'ఐఎండిబి' ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, సారికలు ముఖ్య పాత్రలు పోషించారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఓ కుటుంబం తమ పిల్లాడి కోసం చేసిన అన్వేషణను ఈ సినిమాలో చూపించారు.

ఈ సినిమా గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఓ ఆర్టికల్ లో రాసింది. హిందూ-ముస్లిం అల్లర్లను చూపించిన సినిమాల లిస్టులో 'పర్జానియా' సినిమా కూడా ఉంది.

సిఐఏ విడుదల చేసిన టెర్రరిస్టు గ్రూపులకు సంబంధించిన లిస్టును న్యూస్ మీటర్ తెలుగు చెక్ చేయగా.. అందులో ఆరెస్సెస్ పేరు లేదు.

కాబట్టి, ఆరెస్సెస్ మెంబర్లు ప్రజలపై దాడులు చేస్తున్నారని వైరల్ అవుతున్న ఫోటోలు అవాస్తవం. ఈ ఫోటోలు బాలీవుడ్ సినిమా లోనిది. కాబట్టి ప్రచారం చేస్తున్నదంతా 'పచ్చి అబద్దం'

Next Story