'వెంకీ మామ' విషయంలో టెన్షన్ పడుతున్న సురేష్ బాబు. అసలు ఏమైంది..?
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Sep 2019 10:14 AM GMTవిక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ వెంకీమామ. ఈ చిత్రానికి 'జై లవకుశ, ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, టి.జీ. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కిషాన్ గా నటిస్తుండగా... చైతన్య జవాన్ గా నటిస్తున్నారు. దేశానికి జవాన్, కిసాన్ ఎంతో అవసరమనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు. సైరా అక్టోబర్ 2న రిలీజ్ అయితే... అక్టోబర్ 4న వెంకీమామ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనేది చిత్రయూనిట్ ప్లాన్. అయితే... చిరంజీవి సైరా సినిమాని దాదాపు 200 కోట్లతో నిర్మించారు. ఈ సినిమాకి పోటీగా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశ్యంతో వెంకీమామను వాయిదా వేసారు.
ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమా బడ్జెట్ 50 కోట్ల దాటేసిందట. ఈ విషయం తెలుసుకున్న సురేష్ బాబు.. టీమ్ పై బాగా ఫైర్ అయ్యారట. సినిమాకి హిట్ టాక్ వస్తే... ఫరవాలేదు. ఒకవేళ యావరేజ్ టాక్ వచ్చినా ఇంత మొత్తాన్ని రికవరీ చేయడం చాలా కష్టం. అందుకనే ఈ చిత్రాన్ని ఏ సినిమా పోటీ లేనప్పుడు మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట సురేష్ బాబు.
ఏ క్షణాన్నైనా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుచేత సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టీమ్ ని ఆదేశించారట. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ టీమ్ అదే పనిలో బిజీగా ఉన్నారని తెలిసింది. ఈ క్రేజీ మల్టీస్టారర్ ను అక్టోబర్ 25న రిలీజ్ చేయాలి అనుకున్నట్టు వార్తలు వచ్చాయి కానీ...తాజా సమాచారం ప్రకారం... డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి అనుకుంటన్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని తెలిసింది.