Fact Check : శాకాహారులకు కరోనా రాదా ? WHO ఈ విషయం చెప్పిందా ?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2020 12:10 PM GMT
Fact Check : శాకాహారులకు కరోనా రాదా ?  WHO ఈ విషయం చెప్పిందా ?

సోషల్‌ మీడియాలో ఓ విషయం బాగా తిరుగుతోంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొద్దిసెకన్ల వీడియో, మరికొన్న ప్లాట్‌ఫామ్‌లలో ఓ ఇమేజ్‌ తెగ వైరల్‌గా మారింది. కరోనా మహమ్మారి ఆవరించిన ఈ పరిస్థితుల్లో కరోనాకు సంబంధించిన అంశం కావడంతో సోషల్‌ మీడియా యూజర్లలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అంతేకాదు.. జనంలో కలకలం. చెలరేగడానికి కారణమవుతోంది

శాకాహారులకు కరోనా వైరస్‌ సోకే అవకాశం తక్కువ అన్నది ఈ ప్రచారం సారాంశం. ఏదో ఊరికే చెప్పడమే కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ విషయం చెప్పిందంటూ పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కొందరేమో చిన్న 6 సెకన్ల నిడివి ఉన్న వీడియో క్లిప్‌ను దానికి జత చేస్తుండగా.. మరికొందరు అందులోని ఓ స్క్రీన్‌షాట్‌ను ఈ కామెంట్‌తో కలిపి ఫార్వార్డ్‌ చేస్తున్నారు. కరోనాకు మానవ శరీరంలో ఎనిమల్‌ ఫ్యాట్‌ అవసరమని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొంటున్నారు.

వరల్డ్‌హెల్త్ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ గౌడెన్‌ గలేయా ఈ విషయాలు స్వయంగా చెప్పినట్లు మెస్సేజ్‌ వైరల్‌ అవుతోంది. 'ప్రజలు మాంసం తినడం వల్ల ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన ప్రమాదం కొంత ఉంది' అని చెప్పిన క్లిప్‌ను ఈ మెస్సేజ్‌కు జోడిస్తున్నారు. కేవలం 6 సెకనులు మాత్రమే ఆ వీడియో క్లిప్‌ ఉంది.

[video width="640" height="640" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-09-at-5.02.18-PM-1.mp4"][/video]

ఈ వీడియో క్లిప్‌తో పాటు.. పోస్ట్‌ చేస్తున్న స్క్రీన్‌షాట్‌లో ఇప్పటివరకు డబ్ల్యు హెచ్‌ వో నివేదిక ప్రకారం శాకాహారులకు కరోనా సోకినట్లు తేలలేదు అన్న అంశం ఉంది. అయితే.. ఈ మెస్సేజ్‌ జనంలో కలకలం సృష్టించింది. సోషల్ మీడియా అంతటా పాకిపోయింది.

ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే కింద 'లెబనీస్‌ వేగన్‌' అనే స్ట్రిప్‌ ఉంది. అంటే.. ఆ గ్రూప్‌నకు చెందిన వాళ్లు ఈ వీడియోను వైరల్‌ చేసి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వీడియో క్లిప్‌ను గ్రాఫిక్స్‌మార్చి అనేక సార్లు ఫార్వార్డ్‌ చేసినట్లు సోషల్‌ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతోంది. ఇక.. అంతకుముందే ట్విట్టర్‌ ప్లాట్‌ఫామ్‌లో 'నో మీట్‌ నో కరోనా వైరస్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ట్రెండింగ్‌లో ఉంది.

[video width="640" height="640" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-09-at-5.02.18-PM-2-1.mp4"][/video]

అయితే.. ఈపోస్ట్‌ను ఫ్యాక్ట్‌ చెక్‌ చేస్తే అది అందరినీ తప్పుదారి పట్టించేందుకు రూపొందించిన పోస్టుగా నిర్ధారణ అవుతోంది. ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారంలో ఉన్న డాక్టర్‌ గౌడెన్‌ గలియా.. 2018 ఏప్రిల్‌ నుంచి బీజింగ్‌ కేంద్రంగా WHO ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 1998 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్నారు. సువా, మనీలా, జెనీవాలో కూడా గతంలో WHO తరపున పనిచేసిన అనుభవం ఉంది.

ఒక మీడియా ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో డాక్టర్‌ గౌడెన్‌ గలేయా మాట్లాడుతూ ఏదైనా ఏదైనా ప్రత్యేకమైన ఆహారాన్ని ఆమోదించడానికి లేదా మరేదైనా ఖండించడానికి ఎవరికీ హక్కులేదని, అయితే ప్రజలు మాంసం తినేంతవరకు, జంతువులను పెంచుకోవాల్సిన, మాంసం కోసం వధించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Untitled 4

ప్రచారం : శాకాహారులకు కరోనా సోకదు. జంతువుల కొవ్వు ఉంటేనే మానవులకు కరోనా సోకుతుంది. WHO ప్రతినిధి డాక్టర్‌ గౌడెన్‌ చెప్పారని ప్రచారం.

వాస్తవం : అలాంటిదేమీ లేదు. ఇది తప్పుడు ప్రచారం

కంక్లూజన్‌ : డాక్టర్‌ గౌడెన్‌ ఇంటర్వ్యూలోని ఒక చిన్న క్లిప్‌ను కట్‌ చేసి కరోనా వైరస్‌కు అనుకూలంగా కొందరు మలచుకొని ప్రచారం చేస్తున్నారు. ఇవి WHO అధికారికంగా చేసిన ప్రకటనలు గానీ, నిర్ధారణలు గానీ కావు.

Claim Review:Fact Check : శాకాహారులకు కరోనా రాదా ? WHO ఈ విషయం చెప్పిందా ?
Claim Fact Check:false
Next Story